
Oil Palm Plantation | రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల , మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరుఖ్ నగర్ మండలాలలోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32000 ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.చేవెళ్ల మండలం, దేవుని ఎర్రవెల్లిలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,000 మాత్రమే ఉందని, కాని తమ ప్రభుత్వ కృషి కారణంగా ఇప్పుడు ధర రూ. 18748 గా చేరిందని అన్నారు. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటలైన ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే దాదాపు 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఆయిల పామ్ పంటలకు డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఎంఐడీహెచ్ పథకం కింద ప్యాక్ హౌస్ కి సబ్సిడీ అందించాలని, సబ్సిడీపై డ్రోన్లను ఇవ్వాలని అన్నారు. గుడి మల్కాపూర్ పూల, కూరగాయల మార్కెట్ ని.. అజిజ్ నగర్ కు మార్చాలని కోరారు. మంత్రి స్పందిస్తూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తానికి ఎలాంటి షరతులు లేకుండా డ్రిప్ పరికరాలను సబ్సిడిపై అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యానవన పంటలకు, పామ్ ఆయిల్ తోటలో వేసే అంతర పంటలకు కూడా సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పాలు, కూరగాయల కోసం మన రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండే విధంగా మన రాష్ట్రంలోనే కూరగాయల సాగు, డైరీ లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకోసం రైతులు కూడా సాంప్రదాయ పంటలనే కాకుండా ఉద్యానవన పంటలు, కూరగాయలు, డైరీలు ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలో వచ్చే నెలాఖరు వరకు 5 వేల ఏకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..